
వాతావరణ ప్రతికూల మార్పులపై పోరాడేందుకు వర్ధమాన దేశాలకు 300 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందనుంది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అజర్బైజాన్ రాజధాని బాకు వేదికగా ఐక్యరాజ్యసమితి కాప్-29 చర్చలు ఆదివారం కొనసాగాయి. వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు అందించాల్సిన ఆర్థిక సహాయం 300 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అయితే, ఈ ఒప్పందంపై భారత్ (India) అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతలను నెరవేర్చడానికి ఇష్టపడట్లేదు. అది నిరుత్సాహానికి గురిచేసింది. 300 బిలియన్ డాలర్లు అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలు, ప్రాధాన్యాలను పరిష్కరించవు. దీన్ని తీసుకునేందుకు వ్యతిరేకిస్తున్నాం. ఇది సీబీడీఆర్, ఈక్విటీ సుత్రానికి విరుద్ధంగా ఉంది’ అని భారత బృందం ప్రతినిధి చాందినీ రైనా (Chandni Raina) పేర్కొన్నారు.
ఆర్థిక సాయం ఒప్పందం ఆమోదానికి ముందు భారత ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చాందినీ రైనా పేర్కొన్నారు. మరోవైపు నైజీరియా (Nigeria) సైతం భారత్కు మద్దతు తెలిపింది. కాప్ -29 (COP29) సదస్సుల్లో ధనిక దేశాలు అందించే పర్యావరణ ప్యాకేజీ 300 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అయితే, దీనిపై వర్ధమాన దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ చర్చలు గత శుక్రవారంతో ముగియాల్సి ఉండగా.. ఈ ఒప్పందంపై 250 మంది అభ్యంతరం తెలపడంతో ఆదివారం సైతం చర్చలు కొనసాగాయి.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025