
డిజిటల్ అనువర్తనాల రైతు శిక్షణ అవగాహన.
••• టి.ఆర్.వి.కే- డాట్ సెంటర్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం.
చందుర్తి //మన ప్రజావాణి
తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీ ఆర్ వి కే -డాట్ సెంటర్) కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రోజు చందుర్తి మండలంలోని ఆసిరెడ్డిపల్లె గ్రామంలో "వ్యవసాయంలో డిజిటల్ అనువర్తనాలు" మీద రైతు శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (జిల్లా ఏరువాక కేంద్రం/డాట్ సెంటర్), కరీంనగర్ శాస్త్రవేత్త డా. కె. మదన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తు, వాతావరణ సంబంధిత అంశాలను, చీడ పీడల యాజమాన్యం మార్కెట్ సంబంధిత అంశాల గురించి ఉన్న చోటనే మొబైల్ ని ఉపయోగించి సమాచారాన్ని ఏ విధంగా పొందాలో రైతులకు వివరించారు. అదే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ప్రసారమవుతున్న పి.జె.టీ.ఏ.యు - అగ్రికల్చర్ వీడియోస్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ చేనుకబుర్లు అను రేడియో కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. అలాగే వ్యవసాయం లో వస్తున్న మార్పులకు అనుగుణంగా డిజిటల్ మీడియా ఉపయోగించి అధునాతన సమాచారాన్ని పొందాలని వివరించారు. అదే విధంగా వివిధ మొబైల్ అనువర్తనాలు, పోర్టల్స్ ని ఉపయోగించి వాతావరణ సంబంధిత విషయాలను తెలుసుకునే విధానాన్ని రైతులకు వివరించారు. తదనంతరం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కోఆర్డినేటర్ డా. హరికృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వివిధ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, ముఖ్యంగా అధిక వర్షాల వలన ప్రత్తిలో పార విల్ట్ గమనించడం జరిగింది. దీని నివారణకు ప్రత్తి పంటలో ఆగి ఉన్న నీటిని కాలువల ద్వారా బయటకి పంపించి, కాపర్ ఆక్సి క్లోరైడ్ మందుని 3 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకుని మొక్క మొదళ్లు తడిచే విధంగా పిచికారీ చేయాలి. అలాగే 19:19:19 లేదా 13:0:45 వంటి పోషకాలను కూడా పిచికారీ చేసినట్లయితే ప్రత్తి మొక్కలు తొందరగా కొలుకుంటాయి. తదుపరి డా.ఏం. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... మొగి పురుగు నివారణకు చేపట్టవలసిన చర్యలను తెలియజేయడం జరిగింది. పిలక దశలో మొగి పురుగు ఆశిస్తే మొక్కలు ఎండి చనిపోతాయి. చిరు పొట్ట దశలో తెల్ల కంకులు ఏర్పడుతాయి. ఉదృతి ఎక్కువ గా ఉంటే కార్టాఫ్ హైడ్రో క్లోరైడ్ 400 గ్రా ఎకరానికి లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 60 మి.లీ. ఎకరానికి పిచికారి చేసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు రైతులందరికీ చేరాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పకుండా చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి. అనూష గారు సూచించారు. ఆ తర్వాత శాస్త్రవేత్తల బృందం రైతులు సాగు చేస్తున్న వరి ప్రత్తి పంటలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్ , ఏ ఏం సి వైస్ చైర్మన్ మల్లేశం, పంచాయతీ సెక్రటరీ మహేష్, రావెప్ విద్యార్థినులు, రైతులు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025