
*దళిత వాడకు కంచె..!*
*”బూర్గుల”లో దళితుల పై దారుణం*
*పశువుల మంద స్థలం మాదే అంటూ కంచె*
*ఆరు నెలలుగా దళితవాడకు “చుట్టూరా కంచె”*
*దళితులు ఇండ్ల నుండి బయటకు రాకుండా అడ్డంగా దాష్టీకం*
*మూడు నెలల క్రితం కంచే దాటుతూ వైర్లు తగిలి దళిత చెన్నయ్య మృతి*
*స్వాతంత్ర్య సమర యోధుడు, బూర్గుల నర్సింగరావు కుటుంబ సభ్యుల చర్యలతో గ్రామస్తుల మనస్తాపం*
*ఆరు నెలలుగా అవస్థలు పడుతున్న దళితులు*
*ఇంటి నిర్మాణం కోసం కంచెను ముట్టుకున్న పాపానికి కులం పేరుతో దూషిస్తూ, బండ బూతులు*
*కంచె తొలగిస్తే.. మీ ఇండ్లలో వస్తే ఊరుకుంటారా..?*
*మీ పశువులను మా వద్ద కట్టేయండి కంచే తీసుకోండి..*
*బూర్గులలో దళితులపై జరుగుతున్న దారుణాల పట్ల “హలో షాద్ నగర్ కేపీ” ప్రత్యేక కథనం*
స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో అతను కీలక పాత్ర పోషించాడు. రక్షణ కౌలుథారు చట్టాన్ని అమలు చేయాలని ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించాడు అతను ఎవరో కాదు బూరుగుల నర్సింగరావు.. ఆయన ఆశయ సాధనకు పని చేయాల్సిన కుటుంబ సభ్యులు కొందరు ఈ జాగా మాది మా నిర్ణయానికి ఎవరు అడ్డు చెబుతారు? అనే ధోరణితో దళితవాడలో చుట్టూరా కంచే నిర్మించి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తుల తీరుపై బూర్గుల గ్రామ దళితులు రగిలిపోతున్నారు. నవ సమాజ నిర్మాణం, సమ సమాజ ఏర్పాటు కోసం కృషిచేసిన కీర్తిశేషులు తొలి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు స్వగ్రామం బూర్గులలో ఆయన స్వయాన బంధువులే ఇలాంటి చర్యలకు పాల్పడతారని తాము కలలో కూడా ఊహించలేదని గ్రామస్తులు బాధిత దళితులు మనస్థాపం చెందుతున్నారు. ఈ స్థలం మాది అంటూ చుట్టూ కంచె వేయడం అవి దళితుల ఇండ్ల గడపలకు అడ్డంగా మారడం లాంటి వికృత చేష్టలు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి కూత పెట్టు దూరంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు బూర్గుల రామకృష్ణారావు స్వగ్రామం బూర్గులలో చోటుచేసుకున్నాయి.
*అసలు విషయం ఏమిటంటే..?*
ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో సర్వేనెంబర్ 130లో స్వాతంత్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు ఈ స్థలాన్ని గ్రామ అవసరాల నిమిత్తం అందజేశారు. రెవెన్యూ రికార్డులలో కూడా పశువుల మంద స్థలంగా రికార్డుకు ఎక్కింది.
ఇక్కడ గ్రామపంచాయతీ వారు అనాదిగా నాలుగు బోర్లు వేయించారు. ప్రస్తుతానికి గ్రామానికి నీటి సరఫరా కూడా ఈ స్థలంలో నుండే జరుగుతుంది. అంతేకాదు పశువుల మంద ఉండడానికి వాటికి నీటి అవసరాలు తీర్చేందుకు ఓ తొట్టిని కూడా నిర్మించారు. చాలాకాలంగా గ్రామ అవసరాలకు 4బోర్లు ఉపయోగపడుతున్న ఈ భూమికి ఆనుకొని దాదాపు చాలామంది దళితులు ఇల్లు నిర్మించుకొని అక్కడ జీవిస్తున్నారు. ఈ స్థలం నుండి గ్రామంలోకి రాకపోకలు జరుగుతుంటాయి. ఎంతో దూర దృష్టితో బూర్గుల నర్సింగరావు కొంత స్థలాన్ని మాత్రమే గ్రామ మధ్యలో పశువుల మంద పేరిట వాటి అవసరాల కోసం కేటాయించారు.
*ఇప్పుడేం జరిగిందంటే..?*
సర్వేనెంబర్ 130లో గల సుమారు 20 గుంటల పైచిలుకు స్థలం మాదేనని నరసింహారావు కోడలు విజయలక్ష్మి ఈ స్థలానికి చుట్టూ కంచే నిర్మించారు. ఇందులోనే గ్రామపంచాయతీ నాలుగు బోర్లు ఉండడం గమనార్హం. అంతేకాదు పశువులకు నీటి తొట్టి కూడా ఈ స్థలంలోనే ఉంది. ఇక ఈ కంచెకు అటువైపుగా దళితుల ఇండ్లు ఉన్నాయి. పేద ప్రజలకు అండగా ఇన్నాళ్లు బూర్గుల నర్సింగరావు కుటుంబం నిలబడింది. ఇప్పుడు ఉన్నఫలంగా ఆయన సమాజం కోసం కేటాయించిన ఒక ఎకరా 10 గుంటల భూమిలో ఇప్పటికే ఎందరో పక్క ఇండ్లు కూడా నిర్మించారు. మిగిలిన స్థలంలో గ్రామపంచాయతీ తమ అవసరాలకు ఈ స్థలాన్ని వాడుకుంటుంది. ఇందులోనుండి అవతలి వైపు ఉన్న దళితులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. హఠాత్తుగా ఆరు నెలల క్రితం ఈ స్థలం మాదేనని చుట్టూ కంచ నిర్మించారు. దీంతో అవతలి వైపు ఉన్న దళితుల ఇండ్లకు రాకపోకలు తెగిపోయాయి. ఇనుప కంచెను దాటేందుకు వైర్ల కింది నుండి ఎన్నో గాయాలపాలై బతుకు జీవుడా అంటూ ఇప్పుడు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇది ఏం వైపరీత్యమో ఇంకేంటో తెలియదు కానీ హైటెక్ యుగం వైపు వెళ్తున్న ఈ సమాజంలో ఇలా దళితులు అంటూ వారిని గిరిగిసి మరి రాకపోకలు నిషేధించడం సమంజసం కాదని అంటున్నారు. బూర్గుల నర్సింగరావు చేసిన దేశసేవ సమాజసేవ ముందు ఇలాంటివి బయటపెట్టి ఎందుకు ఆయన పేరు ప్రతిష్టలకు ఆయన కుటుంబానికి మచ్చ తేవాలని కొంతకాలంగా ఆగామని కానీ ఇప్పుడు విజయలక్ష్మి ఫోన్ నుండి గ్రామానికి చెందిన హరి అనే యువకుడికి ఒకరు ఫోన్లో దూషించడం కులం పేరుతో తిట్టడం లాంటి చర్యలతో గ్రామం అట్టుడుకుతుంది. హరి అనే యువకుడు అవతలి వైపు ఇల్లు కట్టుకుంటున్నాడు. తన రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఒకవైపు ఫినిషింగ్ వైర్ ను తొలగించి అందులోకి రాకపోకలు చేస్తున్నాడు. ఈ వైరు ఎందుకు తొలగించావంటు విజయలక్ష్మి ఫోన్ చేయగా ఆమె ఫోన్ మరొకరు లాగుకొని బండ బూతులు తిట్టాడు. అతను అజయ్ బాబు అని బాధితులు పేర్కొంటున్నారు. కులం పేరుతో దూషించాడు. ఫినిషింగ్ వైరును తీయాలంటే మీ పశువులను మా వద్ద కట్టేయండి లేదా మీ ఇంట్లోకి వచ్చి నేను ఉంటా మీరు ఊరుకుంటారా అంటూ హుకుం జారీ చేశాడు. ఫోన్లో మాట్లాడిన ఈ మాటలను మన బూర్గుల గ్రామ వాట్సాప్ గ్రూప్ లో పెట్టడంతో ఈ విషయం బయటి సమాజానికి పోక్కింది.
*దారుణంగా అవమానిస్తున్నారు*
మమ్మల్ని దళితులని చిన్నచూపు చూస్తున్నారని దారుణంగా అవమానిస్తున్నారని బూర్గుల రామకృష్ణారావు నర్సింగరావు లాంటి పెద్దమనుషుల ముఖాలు చూసి వారు చేసిన సేవ చూసి మేము ఏం చెప్పాలో కూడా తెలియట్లేదని గ్రామ దళితులు చెన్నమ్మ చంద్రయ్య ఈశ్వరమ్మ బాలమ్మ పెద్ద జంగయ్య రామయ్య చిన్నకృష్ణయ్య పెద్ద కృష్ణయ్య చెన్నయ్య రామకృష్ణ ఆంజనేయులు తదితర దళితులు హలో షాద్ నగర్ కేపీ మీడియా ముందు వాపోయారు.
కులం పేరుతో దూషించడమే కాకుండా తమను నీచంగా చూస్తున్నారని తమ పశువులను కట్టివేస్తే కంచే తీస్తామని లేకపోతే మీ ఇండ్లలో వచ్చి ఉంటామని నీచంగా మాట్లాడారని బాధితులు ఆరోపించారు.
*కొమ్ముగారి చెన్నయ్య మృతి*
మా ముసలోడు ఇనుప కంచే దాటుతూ రాతి స్తంభం ఇనుప వైర్లు తగిలి గాయాలపాలై మృత్యువాత పడ్డాడని బాధితురాలు కొమ్ముగారి చెన్నమ్మ మీడియా ముందు బోరున విలపించింది. అయినా తాము బూర్గుల నర్సింగరావు సేవలు గుర్తించుకొని దొరలపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆమె అమాయకత్వంగా మీడియా ముందు పేర్కొంది. చీటికిమాటికి పోలీసులు వచ్చి కంచ గురించి ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్లారని పోలీసులను పెట్టి తమను బెదిరిస్తున్నారని దళితులు వాపోయారు. తమను అవమానించిన తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని అది వారిపై మాకు ఉన్న అభిమానమని ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. తామే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తలుచుకుంటే చేసేవారిని కానీ తాము మంచితనంతో వ్యవహరిస్తున్నామని తమ మంచితనాన్ని అసలాగా చేసుకుని గ్రామానికి కేటాయించిన భూమిని తిరిగి లాక్కొని కంచె వేయడం తమ రాకపోకలకు ఇబ్బంది సృష్టించడం ఏం మానవత్వమని ఆమె ప్రశ్నించారు.
*గ్రామంలో గరం గరం*
గ్రామానికి చెందిన దళిత యువకుడు హరిని పులనాడిన వ్యవహారంలో విజయలక్ష్మి తిరుపతి గ్రామస్తులు ఆక్షేపన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సంబంధించిన వాట్స్అప్ గ్రూపులో తిట్టిన ఆడియో రికార్డును వేయడంతో అందరూ ఇది విని నిట్టూరుచుతున్నారు. ఇదేం పద్ధతిని మండిపడుతున్నారు. ఒక వ్యక్తి చనిపోయిన ఎంతోమంది రాకపోకలు లేకుండా ఇబ్బంది పడుతున్న ఏనాడు పల్లెతి మాట అనలేదని కానీ ఘోరంగా తిట్టిన ఈ ఆడియోలు విని మాత్రం దళితులు ఇప్పుడు హలో షాద్ నగర్ కేపీ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు వెంకటయ్య గౌడ్, బాధితుడు హరి, రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. తమ ఆవేదన మీడియా ముందు వినిపించారు. ఈ స్థలంలో బూరుగుల నర్సింగరావు లైబ్రరీ నిర్మించాలని ఆయన ఆశయమని అదేవిధంగా పశువుల మంద కోసం కేటాయించిన ఈ స్థలాన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకొని తమను చిన్నచూపు చూడడం జరిగిందని వారు ఆవేదన చెందారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన బోర్లు ఇందులోనే ఉన్నాయని గ్రామానికి నీటి సరఫరా చేయడానికి వచ్చే సిబ్బంది పట్ల కూడా బెదిరింపులకు దిగుతున్నారని ఇది చాలా దారుణమని వారు వాపోయారు. దీనిపై ఆయా రాజకీయ పార్టీల నాయకులు మేధావులు ప్రజాసంఘాల నాయకులు న్యాయం చేయాలని ప్రభుత్వం తమకు దారి చూపాలని దళితులు వేడుకుంటున్నారు.. *KP*








