
పోలీసుల వైఫల్యం వల్లే పంట ధ్వంసం
* పోలీసులు చట్ట ప్రకారం పని చేస్తారా?
* కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా చేస్తారా?
* పోలీసులకు రెండు రోజుల వ్యవధి ఇస్తున్నాం
* చర్యలు తీసుకోకపోతే చింతకాని పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తాం
* తర్వాత జరిగే పరిణామాలకు పోలీసులుదే బాధ్యత
పదే పదే భట్టి విక్రమార్క, మల్లు నందిని పేర్లు ప్రస్తావన...!
* సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు
ఖమ్మం బ్యూరో, మన ప్రజావాణి
సిపిఎం బోనకల్లు మండల కార్యదర్శి కిలారు సురేష్ పంట ధ్వంసం చింతకాని పోలీసుల వైఫల్యం వల్లే జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఘాట్ గా విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు పోలీసులు పని చేస్తారా, చట్ట ప్రకారం పని చేస్తారా, పోలీసులు తెలుసుకోవాలని, పంట నష్టం ధ్వంసం చేసిన వారిపై రెండు రోజులలో చర్యలు తీసుకోకపోతే, పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించవలసి ఉంటుందని నున్నా నాగేశ్వరరావు పోలీసులను హెచ్చరించారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోనకల్ మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన నంజాల నాగేశ్వరరావు వద్ద 2016లో సిపిఎం మండల కార్యదర్శి అదే గ్రామానికి చెందిన కిలారు సురేష్ రూ.18.50 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ వెంటనే రూ. 14.50 లక్షలు నాగేశ్వరరావుకి సురేష్ చెల్లించారని తెలిపారు. అదే రోజు పొలం స్వాధీన అగ్రిమెంట్ ప్రకారం భూమిని సురేష్ కి నాగేశ్వరరావు స్వాధీనం చేసినట్లు తెలిపారు. అనుకున్న ప్రకారం సురేష్ మిగిలిన డబ్బులు చెల్లించుతానని నాగేశ్వరరావుకు ఎన్నిసార్లు కబురు చేసిన రాలేదన్నారు. నాగేశ్వరరావు రాకపోవడంతో జిల్లా కోర్టుకు సురేష్ వెళ్లినట్లు తెలిపారు. కోర్టు సురేష్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. నాగేశ్వరరావుకి చెల్లించవలసిన మిగిలిన నగదును కోర్టులో జమ చేయాలని సురేష్ న ఆదేశించింది అని తెలిపారు. దీంతో సురేష్ కోర్టు ఆదేశాల మేరకు మిగిలిన నగదును కోర్టులో జమ చేశారని తెలిపారు. నాగేశ్వరరావుని వెంటనే సురేష్ కు రిజిస్ట్రేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అయినా నాగేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జూన్ 15వ తేదీన సురేష్ సాగుచేసిన పత్తి పంట ను నాగేశ్వరరావు ధ్వంసం చేసినట్లు తెలిపారు. అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. కానీ పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదన్నారు. ఇది ఇలా ఉండగానే ఈనెల 23వ తేదీన పెసర పంటను, వరిని నాగేశ్వరరావు అర్ధరాత్రి సమయంలో పూర్తిగా ధ్వంసం చేశాడని తెలిపారు. దీంతో సురేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా పోలీసులు స్పందించలేదన్నారు. మొదటిసారి నాగేశ్వరరావు పై పోలీసులు చర్య తీసుకొని ఉండి ఉంటే రెండవసారి పంట ధ్వంసం చేసేవాడు కాదని తెలిపారు. దీనికి కారణం పోలీసుల వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని పోలీసులను ప్రశ్నిస్తే అధికార పార్టీ నాయకులనుంచి ఒత్తిడి వస్తుందని చెప్పటం చట్ట విరుద్ధమన్నారు. చట్టాన్ని అమలు చేయటానికి పోలీసులు ఉన్నారా, అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేయటానికి పోలీసుల ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేయటానికి పోలీస్ స్టేషన్ ఎందుకు, పోలీసులు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాజీ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బారావు ప్రోత్సాహంతోనే నాగేశ్వరరావు పంటను ధ్వంసం చేసినట్టు తెలిపారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని తాను ఎంత చెబితే అంతేనని నీ వెనక నేను ఉంటానని సుబ్బారావు పంట ధ్వంసం చేపించాడని ఆరోపించారు. పంట నష్టం ధ్వంసం చేసే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైందని ఇది చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. భట్టి విక్రమార్క, మల్లు నందిని ఇటువంటి పనులను ప్రోత్సహిస్తారని తాము భావించడ లేదని, కానీ
పదేపదే సుబ్బారావు భట్టి విక్రమార్క, మల్లు నందిని పేర్లను ప్రస్తావిస్తూ గ్రామంలో ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా న్యాయ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజులలో పంట ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయాలని, లేనియెడల పోలీస్ స్టేషన్ ను వందలాది మందితో ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు పోలీసులే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమస్యను వైరా ఏసిపి, వైరా సీఐ కి కూడా వివరించినట్లు తెలిపారు. అయినా వారి నుంచి కూడా సరైన స్పందన లేదన్నారు. ఇటువంటి పరిణామాల ను చొప్పకట్లపాలెం కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించటం, గ్రామాలలో శాంతి భద్రతలకు భంగం కలిగించడమేనాని హెచ్చరించారు. ఆర్ఆర్ చట్టం ప్రకారం పంట నష్టం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడారు. బోనకల్, చింతకాని మండలాల కార్యదర్శులు కిలారు సురేష్, రాచబంటి రాము, బోనకల్, చింతకాని సిపిఎం మండల కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, నన్నక కృష్ణమూర్తి, గడ్డం రమణ తదితరులు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025