
*వంగర ప్రభుత్వాసుపత్రిలో పాముల కలకలం బెంబేలెత్తుతున్న రోగులు*
– ఆస్పత్రికి వెళ్లేందుకు జంకుతున్న రోగులు
– వైద్య సిబ్బందిని పాము కాటు వేసిన గోప్యంగా ఉంచిన వైద్య అధికారులు
భీమదేవరపల్లి మండల ప్రతినిధి //మన ప్రజావాణి మే 28
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం లోని భారత మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు స్వగ్రామమైన వంగర ప్రభుత్వ ఆసుపత్రిలో పాములు హల్చల్ చేస్తున్నాయి. ఆస్పత్రి భవనం శిథిలావస్థలో ఉండటం, ఆసుపత్రి ఆవరణ అంతా పిచ్చి చెట్లు, ముళ్ళ కంచె ఉండటంతో పాములు, తేళ్లు, విషపురుగులకు ఆవాసంగా మారాయి. గత నెల రోజులుగా వైద్య సిబ్బంది ఆస్పత్రిలో రాత్రి వేళ డ్యూటీ చేసేందుకు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. పాములు ఉన్నాయని తెలియడంతో రోగులు చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు జంకుతున్నారు. కాగా 15 రోజుల క్రితం ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది ఎండి గౌస్ పాషా రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. తోటి సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్య సిబ్బంది గౌస్ పాషా పాము కాటు కు గురయ్యాడనే విషయాన్ని వైద్యాధికారులు గోప్యంగా ఉంచడం సంచలనంగా మారింది. అప్పటినుంచి వైద్య సిబ్బంది రాత్రిల్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి భవనంలో పురాతనం అయినందు వలన రోగులపై పెచ్చులు ఊడి మీద పడుతుండడం ఎవరిపై పడతాయో తెలియక భయపడుతున్నారు.విష సర్పాలకు ఆవాసంగా మారిన ఆసుపత్రి పై సంబంధిత అధికారులు తక్షణమే చొరవ తీసుకోవాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు